సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నేతల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేస్తారు. తమ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందని, కేవలం ఒక వ్యక్తి అభిప్రాయాలకు ఉద్దేశించేలా ఉండదని ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ చురకలు వేశారు.
ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభం, విద్యా, వైద్య రంగాల బలోపేతంపై మేనిఫెస్టో ప్రధానంగా దృష్టిసారిస్తుందని, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికకు రూపకల్పన చేసింది. కాగా దేశంలో అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 నగదు సాయం అందిస్తూ న్యాయ్ పేరిట ఆ పార్టీ ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పధకం కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలైట్గా నిలవనుంది. న్యాయ్ పధకం సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది.