‘ఆయన మంత్రి కాదు..డీలర్‌’  | Sakshi
Sakshi News home page

‘ఆయన మంత్రి కాదు..డీలర్‌’ 

Published Tue, Jul 17 2018 8:22 PM

Congress Says Modi Lied To Indian Women In Manifesto - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌పై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. మహిళా సాధికారతను సాధించే క్రమంలో ట్రిపుల్‌ తలాఖ్‌, నిఖా హలాలా, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు ఆమోదం పొందేలా కాంగ్రెస్‌ సహకరించాలని కోరిన మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను డీలర్‌గా అభివర్ణించింది. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదిం‍చాలని కోరుతూ రాహుల్‌ గాంధీ ప్రధానికి రాసిన లేఖపై మంత్రి స్పందిస్తూ ఈ బిల్లుల ఆమోదానికి తమతో కలిసి రావాలని కాంగ్రెస్‌ను కోరారు. అయితే మంత్రి స్పందనపై కాంగ్రెస్‌ విరుచుకుపడింది.

రవిశంకర్‌ ప్రసాద్‌ లేఖతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును చట్టరూపం దాల్చేలా ప్రధాని మోదీ ఎలాంటి చొరవ చూపడం లేదని తేటతెల్లమైందని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా బిల్లును పార్లమెంట్‌ ఆమోదం పొందేలా వ్యవహరించాల్సిన న్యాయ శాఖా మంత్రి డీలర్‌గా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

ప్రధాని మహిళా రిజర్వేషన్ల బిలుపై హామీ ఇచ్చినప్పుడు ఇది షరతులతో కూడిన హామీగా పేర్కొన్నారా అంటూ ఎంపీ, అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితా దేవ్‌ ప్రశ్నించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టకముందే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎందుకు చేపట్టలేదో ప్రధాని మోదీ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదని అన్నారు. 

Advertisement
Advertisement