కరోనా ఎఫెక్ట్‌ : భారత్‌ కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌ : భారత్‌ కీలక నిర్ణయం

Published Sun, Feb 2 2020 3:41 PM

Coronavirus : India Temporarily Suspends E-Visa Facility For Chinese - Sakshi

న్యూఢిల్లీ : చైనాలో ప్రాణంతక కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్‌ నగరం నుంచి 600 మందికి పైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలించిన సంగతి తెలిసిందే. అలాగే భారత్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్‌లైన్‌ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఇండియా ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బీజింగ్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ-వీసా మీద భారత పర్యటనకు వెళ్లాలనుకే సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేశాం. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వసాయి’ అని పేర్కొంది. 

ఒకవేళ.. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ వెళ్లాలనుకునేవారు.. బీజింగ్‌లోని భారత ఎంబసీ కార్యాలయాన్ని కానీ లేదా షాంఘై, గ్వాంగ్జౌ నగరాల్లోని భారత కాన్సులేట్‌లను గానీ, భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలను గానీ సంప్రదించవచ్చునని సూచించింది. మరోవైపు కరోనా వైరస్‌ బారిన పడి చైనాలో ఇప్పటికే 300 మందికి పైగా మృతిచెందారు. అలాగే 14,562 మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది. అందులో భారత్‌ కూడా ఉంది. భారత్‌లో రెండు కరోనా వైరస్‌ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.

చదవండి : వుహాన్‌లో చిక్కుకున్న కర్నూలు యువతి

Advertisement

తప్పక చదవండి

Advertisement