భార‍్యతో ఫోన్‌ చేయించి.. ప్రియుడిని రప్పించి! | Sakshi
Sakshi News home page

భార‍్యతో ఫోన్‌ చేయించి.. ప్రియుడిని రప్పించి!

Published Wed, Aug 30 2017 5:52 PM

భార‍్యతో ఫోన్‌ చేయించి.. ప్రియుడిని రప్పించి! - Sakshi

చెన్నై: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య ప్రియుడిని తల నరికి దారుణంగా హత్యచేశాడు. ఆ వివరాలిలా.. దిండుగల్‌ జిల్లా వయ్యపాడికి చెందిన సంతోష్‌ (40), కోటయంకు చెందిన వినోద్‌కుమార్‌ భార్య కుమారి (35)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది తెలిసిన వినోద్‌కుమార్‌ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. తను ఇంట్లోలేని వేళల్లో సంతోష్‌ వచ్చి భార్యతో గడుపుతున్నట్లు తెలుసుకున్నాడు.

భార్య ప్రియుడు సంతోష్‌ను అంతం చేయాలని భావించాడు. ఇందుకుగాను భార్య సాయం కోరాడు. సాయం చేయకపోతే భార్యనూ చంపేస్తానని బెదిరించాడు. ఆమె అంగీకరించటంతో పథకం ప్రకారం సంతోష్‌కు ఫోన్‌ చేసి రప్పించాడు. ఇంటికి వచ్చిన సంతోష్‌ తలపై అదనుచూసి ఇనుపరాడ్‌తో గట్టిగా మోదాడు. అతడు అక్కడికక్కడే చనిపోగా శరీరాన్ని ముక్కలుగా నరికివేసి గోనె సంచిలో కట్టి సమీపంలోని చెత్తకుండీలో పడేశాడు.

దుర్వాసన రావడంతో సోమవారం ఓ వ్యక్తి చూడగా.. అనుమానాస్పదంగా గోనె సంచి కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి పరిశీలించి, విచారణ జరపగా అసలు విషయం తేలింది. ఈ మేరకు హత్యకుపాల్పడ్డ వినోద్‌కుమార్‌ దంపతులను అరెస్ట్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement