సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తనపై ఆరోపణలు గుప్పించిన నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తలతో సమావేశమయ్యారు. వీరి భేటీ దాదాపు 15 నిమిషాల పాటు కొనసాగింది. సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్టు సమాచారం. సుప్రీం కోర్టులో పరిస్థితి సజావుగా లేదని, కేసుల కేటాయింపు పద్ధతి ప్రకారం జరగడం లేదని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సీనియర్ జడ్జీలు మీడియా ముందుకు వచ్చిన అనంతరం ప్రధాన న్యాయమూర్తితో సమావేశం కావడం ఇదే తొలిసారి.
మరోవైపు న్యాయవ్యవస్థలో నెలకొన్న సంక్షోభం రెండు,మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించిన క్రమంలో ఆ దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయని భావిస్తున్నారు. అయితే సోమవారం సీజేఐ ప్రకటించిన ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనంలో రెబెల్ జడ్జీల పేర్లు లేకపోవడంతో సంక్షోభానికి తెరపడలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.