రంగంలోకి రాజ్‌నాధ్‌ సింగ్‌...? | Sakshi
Sakshi News home page

రంగంలోకి రాజ్‌నాధ్‌ సింగ్‌...?

Published Fri, Jun 15 2018 12:12 PM

Delhi LG Seeks Rajnath Singh Help In Kejriwal Protest Issue - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న నేపధ్యంలో అనిల్‌ బైజాల్‌ గురువారం సాయంత్రం  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనే స్పష్టత లేకపోయినప్పటికి... కేజ్రివాల్‌ దీక్ష గురించే మాట్లాడుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేజ్రివాల్‌ దీక్షను విరమింపజేసే విషయంలో సహాయం చేసి, ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఎల్జీ, రాజ్‌నాధ్‌ను కోరారనే ప్రచారం జరుగుతుంది. కానీ వీరి భేటిలో ఏం మాట్లాడారనే దాని గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారుల ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్‌ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్‌ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రధానమంత్రి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల తీరును నిరసిస్తూ...ఆప్‌ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రాజ్‌ఘాట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు. ‘మోదీజీ ఫర్‌గివ్‌ ఢిల్లీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రదర్శన కొనసాగించారు.

Advertisement
Advertisement