కళ్లు మూసుకొమ్మని భార్యని ఏం చేశాడంటే.. | Sakshi
Sakshi News home page

కళ్లు మూసుకొమ్మని భార్యని ఏం చేశాడంటే..

Published Sun, Jun 18 2017 11:12 AM

కళ్లు మూసుకొమ్మని భార్యని ఏం చేశాడంటే..

న్యూఢిల్లీ: అప్పటికే వారిద్దరి మధ్య పెద్ద గొడవ. తీవ్ర కోపంతో భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఫైటింగ్‌కు స్వస్తి పలకాలని, ఆ గొడవ మర్చిపోయేందుకు ఆమెకు గొప్ప బహుమతి ఇస్తానని నమ్మబలికాడు. పార్క్‌కు పిలిపించాడు. ఇద్దరు కలుసుకున్నాక కొద్ది సేపు కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం ప్రేమగా పిలిచి అప్యాయంగా దగ్గరకు తీసుకొని తనవైపునకు తిప్పుకొంటూ ఆమెను ఆశ్చర్యపరచబోతున్నానని, కళ్లు మూసుకోవాలని చెప్పాడు. దాంతో తన భర్త నెక్లెస్‌ తీసుకొచ్చాడని ఆమె సంతోషపడింది.

ఆమె అలా కళ్లు మూసుకుందో లేదో వెంటనే ఓ వైరును తీసుకొని ఆమె మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మనోజ్‌ కుమార్‌ వ్యక్తి కోమల్‌ అనే యువతిని రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమ వివాహం. కానీ, రెండేళ్లలోనే వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కోమల్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ మనోజ్‌కుమార్‌ ఎప్పటి నుంచో అనుమానిస్తున్నాడు. అదే విషయంపై వారిద్దరి మధ్య తరుచూ గొడవవుతోంది. ఈ క్రమంలో వారిద్దరు కొద్ది కాలంగా విడివిడిగా ఉంటున్నారు.

దీంతో ఆమెను ఎలాగైనా హత్య చేయాలని కుట్ర పన్నిన మనోజ్‌.. మరోసారి గొడవకు ముగింపు పలుకుదామనే నెపంతో ఆమెకు ఫోన్‌ చేసి ఉత్తర ఢిల్లీలోని బోంటా పార్క్‌ రమ్మని పిలిచాడు. అంగీకరించిన కోమల్‌ అక్కడికి వచ్చాక అతడు ముందుగానే కంజ్‌వాలాలో కొనుగోలు చేసిన వైరుతో మాయమాటలు చెప్పి గొంతుకు బిగించి హత్య చేసి పారిపోయాడు.

ఆ వెంటనే ఫుల్లుగా మద్యం తాగుతూ జరిగిన సంగతిని అతడి స్నేహితులకు వివరిస్తుండగా అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అతడిని అనుమానించి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పెద్ద మొత్తం అడవిలాగ ఉండే ఆ పార్క్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు కూడా ఆరుగంటలు పట్టింది. ఎక్కడ చంపివేశాడనే చోటును కూడా అతడు గుర్తించలేకపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
Advertisement