Sakshi News home page

సైకిళ్లు, బస్సులు ఎక్కనున్న మంత్రులు!

Published Fri, Jan 1 2016 10:15 AM

సైకిళ్లు, బస్సులు ఎక్కనున్న మంత్రులు!

కార్‌పూలింగ్‌లో వెళ్తానన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్
రోజూ 10 లక్షల వాహనాలకు విశ్రాంతి
సరి-బేసి ప్రయోగంతో తగ్గనున్న ఢిల్లీ కాలుష్యం



న్యూఢిల్లీ
దేశరాజధాని నగరంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన సరి-బేసి కార్ల ప్రయోగంతో దాదాపు పది లక్షల వాహనాలకు విశ్రాంతి లభించనుంది. వీవీఐపీలకు మినహాయింపు ఉన్నా, స్వయంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రులు కూడా కార్ల వాడకాన్ని తగ్గించేందుకు కార్ పూలింగ్, ఇతర పద్ధతులు అవలంబిస్తున్నారు. సీఎం కేజ్రీవాల్.. తన సహచర మంత్రులు గోపాల్ రాయ్, సత్యేంద్ర జైన్‌లతో కలిసి ఒకే కారులో వెళ్లారు. సీఎం లైసెన్సు ప్లేటు నెంబరు బేసి సంఖ్యతో ముగుస్తుంది. దాంతో ఆయన తన కారును శుక్రవారం ఉపయోగించుకోవచ్చు. శనివారం మాత్రం ఆ కారు బయటకు తీయకూడదు.

మరికొందరు మంత్రులు విభిన్న మార్గాలు అవలంబిస్తూ సచివాలయానికి వెళ్లనున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా సైకిల్ మీద వెళ్తానన్నారు. పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఆటోలో ప్రయాణిస్తారు. సాంఘిక శాఖ మంత్రి సందీప్ కుమార్ బస్సులో గమ్యం చేరుకుంటారు. సరి-బేసి ప్రయోగం కారణంగా గమ్యాలకు చేరుకోవడం ఎవరికైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసేందుకు రెండు హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అవి.. 011-42400400, 011- 41400400. దాంతోపాటు @transportdelhi అనే ఐడీకి ట్విట్టర్ ద్వారా కూడా సందేశం పంపచ్చు.

రాబోయే రెండు వారాల పాటు రోజు విడిచి రోజు మాత్రమే కార్లను బయటకు తీయాలి. ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే మహిళలు, వీవీఐపీలకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్లు కాక.. తమకు కేటాయించని రోజులో ఎవరైనా వాహనం తీసినట్లు తెలిస్తే.. రూ. 2వేల జరిమానా విధిస్తారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులతో పాటు దాదాపు 7,500 మంది వలంటీర్లు కూడా ట్రాఫిక్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement