న్యూఢిల్లీ: కాలుష్య కోరల నుండి ఢిల్లీని రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిన కేజ్రీవాల్ సర్కార్.. ఆ దిశగా తలపెట్టిన సరి-బేసి విధానాన్ని సీరియస్గా తీసుకుంది. ఢిల్లీలో జనవరి 1 నుండి 15 వరకు సరి-బేసి విధానాన్ని ట్రయల్ రన్ చేపట్టనున్నారు. దీనిలో భాగంగా సరిసంఖ్య నెంబర్లు గల కార్లు, బేసి సంఖ్య నెంబర్లు గల కార్లను ఆల్టర్నేటీవ్ రోజుల్లో రోడ్ల మీదకు అనుమతిస్తారు.
దీని వలన ఢిల్లీలో ఈ పదిహేను రోజులు దాదాపు సగం కార్లు ఇంటికే పరిమితం కానున్నాయి. ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఏర్పరచడం సర్కారుకు తలకు మించిన భారంలా తయారైంది. దీంలో ప్రభుత్వం కన్ను స్కూల్ బస్సులపై పడింది. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అదనంగా 6000 ప్రైవేటు వాహనాలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న ప్రభుత్వం స్కూల్ బస్సుల ద్వారా 2000 వాహనాలను సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం స్కూల్ బస్సులను రవాణా కోసం ఉపయోగించుకోవాలలని భావిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మత్రి, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సూత్రప్రాయంగా తెలిపారు. పాఠశాల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఉన్నటువంటి 26 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు సెలవులు ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు.