ఉద్యోగుల కోసం యజమాని ఏం చేశాడంటే.. | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కోసం యజమాని ఏం చేశాడంటే..

Published Sat, Nov 5 2016 8:39 AM

ఉద్యోగుల కోసం యజమాని ఏం చేశాడంటే..

చైనాలో కొంతమంది వ్యాపారవేత్తలు తమ దగ్గర పనిచేసే ఉద్యోగులందరినీ సెలవులకు విదేశాలకు తీసుకెళ్తుంటారు. అలాంటివి చూసి స్ఫూర్తి పొందాడో ఏమో గానీ.. గుజరాత్‌లోని ఓ వజ్రాల వ్యాపారి తన దగ్గర పనిచేసే మొత్తం 300 మందిని, వాళ్ల కుటుంబ సభ్యులందరితో కలిపి ఉత్తరాఖండ్‌లో 10 రోజుల పర్యటనకు తీసుకెళ్లాడు. ఉద్యోగులు, వాళ్ల భార్యాపిల్లలు అంతా కలిపి ఏకంగా 1200 మంది అయ్యారు. ముంబై మహానగరంతో పాటు తన సొంత ఊరైన సూరత్‌లో శ్రీ రామకృష్ణా ఎక్స్‌పోర్ట్స్‌ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేసే గోవింద్ ఢోలకియా ఈ పని మొదలుపెట్టాడు. మొత్తం సిబ్బంది అందరికీ 15 రోజుల సెలవు ప్రకటించి, రూ. 90 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక ఏసీ రైలు బుక్ చేశాడు. 
 
ప్రతియేటా తమ బాస్ ఇలాగే తమను టూర్లకు తీసుకెళ్తారని ఉద్యోగులలో ఒకరు తెలిపారు. తామంతా ఆయనను సార్ అని కాకుండా, 'కాకాజీ' అని ఆప్యాయంగా పిలుచుకుంటామన్నారు. తమతో పాటు ఆయన, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ యాత్రకు వచ్చారు. సైట్‌సీయింగ్‌తో పాటు ఈ పది రోజుల్లో తాము సామాజిక సేవ కూడా చేస్తామని మరో ఉద్యోగి చెప్పారు. గురువారం నాడు తాము రిషికేశ్ సమీపంలోపని స్వర్గాశ్రమాన్ని స్థానిక పంచాయతీ సభ్యుల సాయంతో శుభ్రం చేశామన్నారు. అయితే.. ఢోలకియా మాత్రం తాను చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం కావాలని ఏమాత్రం కోరుకోవడం లేదు. అందుకే ఆయనను కలవాలని మీడియా ప్రతినిధులు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. 

Advertisement
Advertisement