న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ రకంగా ప్రభుత్వానికి, బ్యాంకులకు అగ్ని పరీక్ష అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం అన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000నోట్లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరం బుధవారం మీడియాతో మాట్లాడారు. నల్లధనాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే తాము సమర్థిస్తామని చెప్పారు.
అయితే, పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా, వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిల్లర వర్తకులకు తాజా నిర్ణయంతో ఇబ్బందులు తప్పవని చెప్పారు. 1978లో నోట్లను రద్దు చేసిన జనతా ప్రభుత్వం కూడా విఫలమైందని, కొత్త నోట్లను ప్రవేశ పెట్టడానికి గతంలో చాలా ప్రభుత్వాలు నోట్లు రద్దు చేయాలని ఆలోచించి దాని వల్ల ప్రయోజనం ఉండదనే విరమించుకున్నాయని గుర్తు చేశారు. మళ్లీ రెండు వేల నోట్లతో నల్లధనం రాదా అని చిదంబరం ప్రశ్నించారు. తాజాగా వీటి కోసం రూ.15 నుంచి 20 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.