ముంబయిలో దారుణం.. పాశవికం | Sakshi
Sakshi News home page

ముంబయిలో దారుణం.. పాశవికం

Published Tue, Dec 20 2016 10:00 AM

ముంబయిలో దారుణం.. పాశవికం - Sakshi

ముంబయి: ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. అత్యంత పాశవికమైన చర్య నెలకొంది. గొడవ పడి ఆ కక్షతో ఓ మహిళ మరో మహిళా కానిస్టేబుల్‌ ఐదేళ్ల పాపను ఏకంగా 15 అంతస్తులపై నుంచి విసిరేసింది. కింద పడగానే పెద్ద శబ్దం రావడంతో వెళ్లి చూసిన వాచ్‌మెన్‌ షాక్‌కు గురయ్యాడు. బాలికను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఆ మహిళకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఆ బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం ముంబయిలోని బైకుల్లాలో గల న్యూ హింద్‌ మాదా కాలనీలో 22 అంతస్తుల భవనం ఉంది. అందులో అశోక్‌, ఆర్తి అనే భార్యభర్తలు 15వ అంతస్తులో ఉంటున్నారు. వీరిలో ఆర్తి వర్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తుండగా అశోక్‌ మాత్రం ఆటో మొబైల్‌ వ్యాపారం చూసుకోవడంతోపాటు ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. సోమవారం ఆర్తి తన ఉద్యోగానికి వెళ్లగా అశోక్‌ ఇంట్లోనే ఉన్నాడు. ప్రస్తుతం గ్లోరియా ప్రి ప్రైమరీ స్కూల్లో చదువుతున్న తమ ఐదేళ్ల పాప బయట ఆడుకుంటోంది. కానీ, అలా ఆడుతున్న కాసేపటికే ఆ పాపను ఎవరో 15వ ఫ్లోర్‌ నుంచి కిందకు ఎవరో విసిరేశారు. ఆ భవనంలో ఉన్నవారందరినీ ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసేలా చేసింది. విచారణ చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అంతకుముందు ఆ మహిళా కానిస్టేబుల్‌ తో గొడవపడిన ఓ మహిళే ఈ దారుణం చేసి ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement