ఉగ్ర స్థావరాలను నాశనం చేస్తేనే.. | Sakshi
Sakshi News home page

ఉగ్ర స్థావరాలను నాశనం చేస్తేనే..

Published Wed, Oct 25 2017 1:36 AM

Ghani Back Home After Talks With Modi - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల దాడులతో తీవ్రంగా నష్టపోతున్న అఫ్గానిస్తాన్‌లో శాంతి స్థాపనకు సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేయడమే మార్గమని పాకిస్తాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత్‌–అఫ్గాన్‌లు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.

ఇటీవల అఫ్గానిస్తాన్‌కు భారత్‌ భద్రత, రక్షణ రంగాల్లో అందించిన సాయంపై వారు సమీక్షించారు. అఫ్గాన్‌ అవసరాలకు అనుగుణంగా అక్కడి రక్షణ, పోలీసు దళాలకు మరింత సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఘనీకి మోదీ హామీనిచ్చారు. వారిరువురు వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించారనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అలాగే అఫ్గాన్‌లో సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్న విధానాన్ని మోదీ ప్రశంసించారు.  అన్ని స్థాయిల్లోనూ ద్వైపాక్షిక, వ్యూహాత్మక చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, ఘనీలు నిర్ణయించారు. మోదీతో సమావేశానికి ముందు ఘనీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తోనూ సమావేశమయ్యారు. 

Advertisement
Advertisement