పెళ్లికొడుకును కిడ్నాప్‌ చేసిన ప్రేయసి | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకును కిడ్నాప్‌ చేసిన ప్రేయసి

Published Thu, May 18 2017 3:13 AM

పెళ్లికొడుకును కిడ్నాప్‌ చేసిన ప్రేయసి

బుందేల్‌ఖండ్‌: అక్కడ ఓ పెళ్లి జరుగుతోంది. అప్పుడే కల్యాణమంటపం ముందు మహీంద్రా స్కార్పియో వాహనం వచ్చి ఆగింది. అందులోంచి ఓ యువతి, ఇద్దరు వ్యక్తులు దిగారు. సాధారణంగా పెళ్లి పీటల మీద నుంచి వధువును ఎత్తుకుపోవడం మనం చాలా సినిమాల్లో చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం కారులోంచి దిగిన యువతి నేరుగా పెళ్లి కొడుకు వద్దకు వెళ్లి అతని తలపై తుపాకీ గురిపెట్టింది. ‘ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేయాలనుకుంటున్నాడు. ఇది జరగనివ్వను’ అంటూ అతణ్ని కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయింది.

సినిమాటిక్‌గా ఉన్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. అశోక్‌ యాదవ్‌ అనే వ్యక్తికి భారతి అనే యువతితో పెళ్లి జరుగుతుండగా అతని ప్రియురాలు అతణ్ని ఎత్తుకుపోయింది. స్థానికుల సమాచారం ప్రకారం అశోక్, సదరు యువతి పట్టణంలో ఓ చోట కలిసి పనిచేసేవారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి రహస్యంగా వివాహం చేసుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ల ఒత్తిడితో అతను భారతితో పెళ్లికి ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో పెళ్లికూతురు తీవ్రంగా కలత చెందగా, ఆమె కుటుంబ సభ్యులు యువతిపై కిడ్నాప్‌ కేసు పెట్టారు. మరోవైపు కొందరు పోలీసులు మాత్రం యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటివారు ఉండటం వల్ల అమ్మాయిలను మోసం చేయాలనుకునే పోకిరీల్లో భయం ఏర్పడుతుందని వారంటున్నారు.

Advertisement
Advertisement