యూనివర్సిటీలకు సుప్రీం షాక్‌ | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీలకు సుప్రీం షాక్‌

Published Mon, Jul 16 2018 10:46 AM

Government Private Varsities Cannot Increase Fees Says SC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్సిటీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ, ప్రవేటు యూనివర్సిటీలు ఏకపక్షంగా ఫీజలు పెంచకూడదంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తమిళనాడులోని అన్నమలై యూనివర్సిటీకి చెందిన ఎమ్‌బీబీఎస్‌ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం ఆదివారం విచారించింది. రుసుముల నియంత్రణ కమిటీని సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపొద్దని తీర్పులో పేర్కొంది.

2013-14 విద్యా సంవత్సరంలో అన్నమలై యూనివర్సిటీ ఏడాదికి 5.54 లక్షలు ఫీజు పెంచడంతో ఎమ్‌బీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం 2003లో  రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించింది.

ప్రతి రాష్ట్రం సొంతగా ఫీజుల నియంత్రణ కమిటీని కలిగి ఉండాలని, ఆ కమిటీని సంప్రదించి మాత్రమే ఫీజులు పెంచాలని 2003లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచించింది. 1992 చట్టం ప్రకారం మరో రెండు వారాల్లో యూనివర్సిటీ బ్యాలెన్స్‌ షీట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఎమ్‌బీబీఎస్‌కు 12,290, బీడీఎస్‌ కోర్సుకు 10,290 వసూలు చేయాలని పేర్కొంది.

Advertisement
Advertisement