ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైల్వే ట్రాక్లపైకి నీరు చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మలవలి-కామసెత్ స్టేషన్ల మధ్య, లోన్ వాలా- కర్జత్ స్టేషన్ల మధ్య ట్రాక్ పై నీరు చేరడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపివేశారు.
వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రధాన రహదారులపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇళ్లకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు.