Sakshi News home page

పొద్దున్నే జైలు బద్దలు ఎలా సాధ్యమైంది?

Published Mon, Nov 28 2016 10:05 AM

పొద్దున్నే జైలు బద్దలు ఎలా సాధ్యమైంది?

నభా(పాటియాలా): పంజాబ్‌.. నిరంతరం అప్రమత్తంగా ఉండే రాష్ట్రం. ఉగ్రవాదుల కదలికలతో ఎప్పటిప్పుడు పోలీసులే కాకుండా ఆర్మీ బూట్ల చప్పుడు కూడా అక్కడి వీధుల్లో వినిపిస్తుంటాయి. అలాంటి పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని నభా జైలు. సాధారణ ఖైదీలు ఉండే జైళ్లకే భద్రత కట్టుదిట్టంగా ఉండటంతోపాటు నిఘా నేత్రాలు కూడా పనిచేస్తుంటాయి. సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఇక అలాంటిది కొందరు ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు ఉన్న జైలుకు సంబంధించి పోలీసుల మరెంత అప్రమత్తంగా ఉండాలి. కానీ, అలాంటి జాగరుకత ఏదీ కూడా నభా జైలు వద్ద లేదని తెలుస్తోంది.

అచ్చం సినీ ఫక్కీలో ఓ తెర మీద సినిమాలో చూస్తున్నట్లుగా దుండగులు తెగబడ్డారు. సరిగ్గా ఆదివారం ఉదయం  తొమ్మిదిగంటల ప్రాంతంలో వాహనాల్లో 12 నుంచి 14 మంది దుండగులు పోలీసుల వేషాల్లో వచ్చారు. అందులో మూడు వాహనాలని జైలు వెలుపలే ఆపేశారు. తెలివిగా ఓ ఖైదీని తీసుకొచ్చామని చెప్పి సెంట్రీతో గేటు తీయించారు. ఆ వెంటనే అప్పటి వరకు తమ బ్లాంకెట్లకింద దాచుకున్న ఆయుధాలను తీసి నేరుగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఏం జరుగుతుంతో తెలిసే లోపే లోపలికి వెళ్లి తమకు కావాల్సిన ఖలిస్తాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్మీందర్‌ సింగ్‌ అలియాస్‌ మింటూ మరికొందరు గ్యాంగ్‌ స్టర్లను విడిపించుకెళ్లారు. ఈ సంఘటన ఒక్కసారిగా పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భద్రత డొల్లను బయటపెట్టింది. ఈ సందర్భంగా వారికి సహకరించిన పర్మిందర్‌ సింగ్‌ అలియాస్‌ పిండాను అరెస్టు చేశారు.

జైలు గోడలు బద్ధలు కొట్టేందుకు ప్రణాళిక రచించింది కూడా ఇతడే. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలుపైనే దాడి చేయడం అంటే మాములు విషయం కాదు.. అలా చేయాలంటూ ఆ జైలుకు సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. అయితే, అతడు పర్మిందర్‌ సింగేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా? లేదా జైలుకు సెక్యూరిటీ చూసుకునే వారికి అణువనువూ తెలుస్తుంది.. వారే పూర్తి వివరాలు పర్మిందర్‌కు అందించారా? అంతపెద్ద మొత్తంలో జైలులోకి వచ్చిన సాయుధులు ఒక్క సెంట్రీనికానీ, సెక్యూరిటీ సిబ్బందినిగానీ గాయపరచపోవడానికి గల కారణాలు ఏమిటీ? పై అధికారుల హస్తం ఇందులో ఉందా? దాడికి సంబంధించి ముందే జైలు సిబ్బందికి తెలుసా? పోలీసుల చేతికి పర్మిందర్‌ దొరికిపోయినప్పుడూ ఖలిస్తాన్ చీఫ్‌ హర్మీందర్‌ మధ్యలో దిగిపోయాడని చెప్పాడు.

వీరందరు నేపాల్‌ లో కలుసుకునేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపాడు. దీని ప్రకారం తప్పించుకున్నవారందరికీ ఎస్కేప్‌కు సంబంధించిన వివరాలు ఎవరు? ఎలా ? చేరవేశారు.. ఇంత జరుగుతున్నప్పటికీ జైలు సిబ్బంది ఎందుకు అప్రమత్తంగా లేకుండా పోయారు? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
ఇంతకీ ఎవరీ హర్మీందర్‌ సింగ్?
హర్మీందర్‌ సింగ్‌ అలియాస్‌ మింటూ మితిమీరిన సిక్కు మతాభిమాని. సిక్కులకు ప్రత్యేక రాజ్యస్థాపనే లక్ష్యంగా ఏర్పడిన ఖలిస్తాన్‌ లిబరేషన్ ఫ్రంట్‌ (కేఎల్‌ఎఫ్‌)కు చీఫ్‌ గాఉన్నాడు. ఇతడిపై దాదాపు 10 ఉగ్రవాద సంబంధ చర్యలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. పంజాబ్‌ పోలీసులకు అతడు దొరకకుండా చాలాకాలం తప్పించుకు తిరిగాడు. 2008లో సిర్సాకు చెందిన దేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌పై కూడా దాడి చేసింది మింటూనే. 2010లో హల్వారా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన పాత్ర కూడా అతడిదే. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న అతడు థాయిలాండ్‌ నుంచి ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు రాగానే 2014నవంబర్‌ నెలలో అరెస్టు చేసి ప్రస్తుతం నభా జైలులో ఉంచారు. 

Advertisement
Advertisement
Advertisement