ఇది లెక్కలు అడగాల్సిన సమయం | Sakshi
Sakshi News home page

ఇది లెక్కలు అడగాల్సిన సమయం

Published Fri, Oct 2 2015 4:52 PM

ఇది లెక్కలు అడగాల్సిన సమయం - Sakshi

న్యూఢిల్లీ :  ఢిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి  ప్రధాని నరేంద్ర మోదీపై  విరుచుకుపడ్డారు. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని  విస్మరించడాన్ని ఆయన తప్పుబట్టారు.   శాస్త్రి లాంటి జాతీయ నాయకుడికి ప్రధాని నివాళలర్పించకపోవడం మంచి  పరిణామం కాదన్నారు.  

మహాత్మాగాంధీ  146వ జయంతి సందర్భంగా  రాజ్ఘాట్  సందర్శించి  గాంధీజీకి నివాళులర్పించిన కేజ్రీవాల్ అనంతరం  విజయఘాట్లోని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా అంజలి ఘటించారు.   ఆ తర్వాత విధాన సభలో ఏర్పాటు చేసిన సభలో  ప్రధానిపై  సీఎం పరోక్ష విమర్శలు గుప్పించారు.   

విభజించి పాలించే సంస్కృతి  అంతం కోసం  అందరం ప్రార్ధిద్దాం.  బీఫ్ నిషేధం మనుషుల ప్రాణాలను హరిస్తోందంటూ పరోక్షంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వాగ్దానాలకు,  చేపడుతున్న కార్యక్రమాలకు తగ్గట్టుగా కార్యాచరణ కూడా  ఉండాలన్నారు.  ఫోటోల కోసం ఏడాదికొకసారి వీధులు శుభ్రం చేస్తే స్వచ్ఛ భారత్ కల నెరవేరదంటూ  కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు

అటూ ట్విట్టర్లో  కూడా కేజ్రీవాల్...  మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  స్వచ్ఛ భారత్ అంటూ పాటలు పాడితే ,చీపురు పట్టుకుని వీధులు శుభ్రం కావని  విమర్శించారు.   అసలు స్వచ్ఛ భారత్ కోసం ఇప్పటి వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో  సమాచారం కావాలన్నారు.   గత ఏడాది  ఈ స్వచ్ఛ  భారత్ మిషన్  వెచ్చించిన నిధుల లెక్కలు  ప్రకటించాలన్నారు.  ఈ  కార్యక్రమం ద్వారా శుభ్రమైన వీధుల వివరాలు కావాలంటే కేజ్రీవాల్ ట్విట్ చేశారు.   ఈ వివరాలను అడగాల్సిన సందర్భం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement