‘గాంధీ ఇండియానా లేక గాడ్సే ఇండియానా’ | Sakshi
Sakshi News home page

‘గాంధీ ఇండియానా లేక గాడ్సే ఇండియానా’

Published Fri, Sep 20 2019 8:45 PM

Is this India of Gandhi or India of Godse Question By Mufti Daughter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ పీడీపీ అధినేత్రి, మాజీ ముఖ్యమత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజార్ జావేద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గాంధీ జన్శించిన ఇండియానా లేక గాడ్సే ఇండియానా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూ ఇల్తిజార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కశ్మీర్‌పై బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. నెలలు గడుస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఏ మాత్రం మెరుగుపడలేదని, ప్రజలపై నిర్బంధం విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌ ప్రజలకు, దేశ ప్రజలకు మధ్య దూరం చాలా పెరిగిందన్నారు.

తమపై విధించిన ఆంక్షలను పూర్తిగా సడలించి లోయలో ప్రశాంతతను పునరుద్ధరించాలని ఇల్తిజార్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయంపై తమను కనీసం సంప్రదించకపోవడం దారుణమన్నారు. ఇది తమ హక్కులను కాలరాయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా ఆర్టికల్ 370 రద్దు రాష్ట్ర విభజన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సహా ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధం లో ఉంచిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలు న్యాయవాదులు ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని సనా అన్నారు. అదే విధంగా కశ్మీర్‌లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు.

Advertisement
Advertisement