ఇండియానే సేఫ్‌.. అమెరికాకు వెళ్లం! | Sakshi
Sakshi News home page

ఇండియానే సేఫ్‌.. అమెరికాకు వెళ్లం!

Published Thu, Apr 30 2020 4:13 AM

India itself safe says Americans who stuck in India - Sakshi

సాక్షి, అమరావతి: భారత్‌లో ఉన్న అమెరికన్లు ఇప్పుడు తమ దేశం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కరోనా మహమ్మారిని అమెరికా కంటే భారతదేశమే సమర్థంగా కట్టడి చేస్తోందని వాళ్లు భావిస్తుండటమే దీనికి కారణం. మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తామంటూ ఆ దేశ ప్రతినిధులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా సరే.. వీళ్లు అందుబాటులోకి రావడం లేదు. స్వయానా అమెరికా ప్రిన్సిపుల్‌ డిప్యూటీ సెక్రటరీ ఇయాన్‌ బ్రౌన్లీనే ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. 

► వ్యాపార, ఉద్యోగావసరాలతో పాటు పర్యాటకులుగా దాదాపు 10 వేల మంది అమెరికన్లు భారతదేశానికి వచ్చారు. 
► కరోనా వైరస్‌ ప్రబలడంతో భారతదేశం లాక్‌డౌన్‌ ప్రకటించి.. అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేయడంతో వీరు ఇక్కడే చిక్కుకుపోయారు.  
► దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ వారు ఆందోళన చెంది.. తమను ప్రత్యేక విమానాల్లో అమెరికా తీసుకెళ్లాలని ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి ఈ–మెయిల్స్‌  పంపించి పేర్లు నమోదు చేసుకున్నారు. 
► ప్రత్యేక విమానాల ద్వారా వీరందరినీ స్వదేశానికి తీసుకెళ్లాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 
► మొదటి విడతలో నాలుగు వేల మంది అమెరికన్లను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నుంచి ఈ నెల రెండోవారంలో ప్రత్యేక విమానాల్లో అమెరికా తీసుకెళ్లారు. 
► మిగిలిన ఆరు వేల మంది అమెరికన్లను తీసుకెళ్లేందుకు ఆ దేశ ప్రతినిధులు వీరి కోసం ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రాకుండా.. కొంతకాలం భారత్‌లోనే ఉంటామని పరోక్షంగా చెబుతున్నారు. 
► అమెరికాలో కరోనా కేసులు 10 లక్షలు దాటగా.. 58 వేల మందికి పైగా మరణించారు.
► కరోనా కట్టడిలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని వారు భావిస్తున్నారు. మరోవైపు భారత్‌లో కరోనా కేసులు 31 వేలే ఉన్నాయి.

Advertisement
Advertisement