జయ మృతిపై శశికళ, అపోలో చైర్మన్‌కు సమన్లు | Sakshi
Sakshi News home page

జయలలిత మృతిపై ముగ్గురికి నోటీసుల జారీ

Published Fri, Dec 22 2017 2:00 PM

Jayalalithaa death: Inquiry panel notice to sasikala, Chairman of Apollo - Sakshi

చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్‌ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో గ్రూప్‌ ఆసుపత్రుల చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డికి కమిషన్‌ సమన్లు ఇచ్చింది. 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్‌ ఆదేశించింది. కాగా అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే.

జయలలితన శ్వాస తీసుకోలేని స్థితిలో  ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించామని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ చానెల్‌కు గతంలో వెల్లడించారు. మరోవైపు  జయను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆమె జ్వరంతో బాధపడుతున్నారనే ప్రకటనను ఇచ్చినట్లు అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి కూడా పేర్కొన్న విషయం విదితమే. అంతేకాకుండా జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో శశికళ... ఎవరినీ లోనికి అనుమతించలేదని, జయను చూడనివ్వలేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.

జయలలిత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్‌ 5 న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆమె మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్‌ సెల్వం డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది. దీంతో విచారణ కమిషన్‌... ఇందుకు సంబంధించి ఒక్కొక్కరినీ విచారణ చేస్తోంది. తాజాగా శశికళతో పాటుగా ప్రతాప్‌ రెడ్డి, ప్రీతారెడ్డికి నోటీసులు ఇచ్చింది.

ఇక జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అనూహ్యంగా బుధవారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఆర్కే నగర్‌ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్‌ జరగడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ వర్గానికి చెందిన, శాసనసభలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వెట్రివేల్‌ ఈ వీడియో విడుదల చేశారు.

Advertisement
Advertisement