న్యూఢిల్లీ: యజమాని, సేవకుల మధ్య సంబంధానికి నిండుదనాన్ని, గౌరవాన్ని కల్పించిన సంఘటన ఇది. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ నటుడు రంగనాథ్ తన ఇంట్లో పని చేసిన మహిళ పేరిట బ్యాంకులో డబ్బులు జమ చేసి వార్తల్లో నిలవగా.. ఇపుడు ఇటీవల మరణించిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి జెరామ్ పటేల్ (86) తన ఔదార్యంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. చిన్నప్పటినుంచి తన దగ్గర విశ్వాసంతో పని చేసిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో కోటి రూపాయల జమ చేశాడు. గత నలభై రెండు ఏళ్లుగా తన సేవకుడిగా వున్న దయాబాయ్కు పటేల్ ఏకంగా కోటి రూపాయలు ముట్టజెప్పారు. దీంతోపాటు తన దగ్గర పనిచేసిన మిగతా సేవకులకు కూడా భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చారు.
వివరాల్లోకి ఢిల్లీకి చెందిన జెరామ్ పటేల్ పక్షవాతంతో బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు అతణ్ని పట్టించుకోకపోవడంతో దయాబాయ్ అన్నీ తానే సేవలు చేశాడు.12 సంవత్సరాల వయసులో పటేల్ ఇంట్లో పనికి కుదిరిన దయాకు గత నలభై రెండు ఏళ్లుగా తన సేవలందించాడు. దీంతో పటేల్ సేవకునికి తన కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు అతని కోట్ల విలువ చేసే మొత్తం ఆస్తిలో దయాకు భాగస్వామ్యం కల్పిస్తూ వీలునామా రాశాడు. దీనిపై దయా సంతోషం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లు పటేల్ సాబ్కు సేవ చేసే భాగ్యం తనకు దక్కడం తన అదృష్టమని తెలిపాడు. ఆయన కష్టార్జితంతో తన లాంటి వారి ఇంతటి ఔదార్యం చూపించడం చాలా గొప్పవిషయమన్నారు.
కాగా ప్రఖ్యాత చిత్రకారుడు జెరామ్ పటేల్ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నాడు. లలిత కళా అకాడమీ అవార్డును కూడా అందుకున్న ఆయన దేశ విదేశాల్లో వందకు పైగా ఎగ్జిబిషన్స్ నిర్వహించారు. ఆరు కోట్ల రూపాయల విలువ చేసే అతని కళాఖండాలను, శిల్పాలను ఢిల్లీలోని కిరణ్ నాదార్ మ్యూజియానికి తక్కవ రేటుకే ఇచ్చేశారు.