న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో జరిగిన జర్నలిస్టు శంతను భౌమిక్ హత్యను పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా గొంతు నొక్కడానికి జర్నలిస్టును హత్యచేయడం అమానవీయ చర్య అని పాత్రికేయ సమాజం మండిపడింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ అధ్యక్షురాలు అకిలా ఉరంకార్ త్రిపుర ప్రభుత్వాన్ని కోరారు.
పాత్రికేయులు తమ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించడానికి భరోసా ఇచ్చేలా పటిష్ట యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్క్లబ్స్ ఇన్ ఇండియా, నార్త్ఈస్ట్ మీడియా ఫోరం కలసి ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. శంతను హత్య కేసులో విచారణ వేగంగా పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని పాత్రికేయ సంఘాలు ఈ ప్రకటనలో పేర్కొన్నాయి.