సాక్షి,బెంగళూర్: కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో అన్ని రికార్డులను బద్దలుకొట్టిందని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వం నిలిచిందని ఓ సర్వే పేర్కొనడాన్ని ఆయన ప్రస్తావించారు. వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రను అమిత్ షా ప్రారంభించారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప చేపట్టిన ఈ యాత్ర సిద్ధరామయ్య సర్కార్ను సాగనంపేలా సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇస్తున్న నిధులు లబ్థిదారులకు చేరడం లేదని ఆరోపించారు.
టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను రాష్ర్ట ప్రభుత్వం ఘనంగా నిర్వహించడాన్ని అమిత్ షా తప్పుపడుతూ అవి ఓటుబ్యాంకు రాజకీయాలని అన్నారు. కర్ణాటక రాష్ర్ట అవతరణోత్సవాలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహించిందని విమర్శించారు.
75 రోజుల పాటు సాగే పరివర్తన యాత్ర రాష్ర్టంలోని 224 నియోజకవర్గాల మీదుగా సాగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది. యాత్ర సాగే ప్రాంతాల్లో పలు చోట్ల కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు హాజరవుతారు. యాత్ర ముగింపు సందర్భంగా జరిగే భారీ ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు.