29 నుంచి కొచ్చి విమానాశ్రయం పునరుద్ధరణ | Sakshi
Sakshi News home page

29 నుంచి కొచ్చి విమానాశ్రయం పునరుద్ధరణ

Published Wed, Aug 22 2018 8:36 PM

Kochi Airport To Reopen Later This Month - Sakshi

తిరువనంతపురం : కేరళను వణికించిన వరదలతో మూతపడిన కొచ్చి విమానాశ్రయం ఈనెల 29 నుంచి మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించనుంది. గతంలో ఈ నెల 26 నుంచి విమానాశ్రయంలో సర్వీసుల పునరుద్ధరణ చేపడతామని అధికారులు ప్రకటించగా దీన్ని మరో మూడు రోజులు పొడిగించారు. వరదలతో కొచ్చికి దూరంగా తరలివెళ్లిన ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరేందుకు సమయం అవసరమని అధికారులు భావించడంతో ఈనెల 29 నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించాలని బుధవారం జరిగిన కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (సీఐఏఎల్‌) సమావేశంలో నిర్ణయించారు. విమానాశ్రయానికి సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికీ మూతపడ్డాయని, ప్రయాణీకులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయనే అంచనాతో మరో మూడు రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌ సేవల పునరుద్ధరణను పొడిగించామని, ఈనెల 29 నుంచి విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని సీఐఏఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

భారీ వరదలతో ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే, ట్యాక్సీ వే, పార్కింగ్‌ ఏరియాల్లో నిలిచిన నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, రన్‌వే పునరుద్ధరణకు రెండు మూడు రోజలు సమయం పడుతుందని తెలిపింది. కాగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు రెండు వారాలుగా ఆపరేషన్స్‌ నిలిచిపోవడంతో విమానాశ్రయానికి రూ 22-27 కోట్ల నష్టం వాటిల్లిందని కేర్‌ రేటింగ్స్‌ సంస్థ అంచనా వేసింది. ఇతర ఆపరేషన్స్‌, సేవల కారణంగా మరో 10 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది.

Advertisement
Advertisement