‘నైతిక హక్కు కోల్పోయా.. అందుకే రాజీనామా’

31 Oct, 2018 08:41 IST|Sakshi
కృష్ణ చంద్ర సాగరియా

భువనేశ్వర్‌ : అత్యాచార బాధితురాలికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కోరాపుట్‌ ఎమ్మెల్యే కృష్ణ చంద్ర సాగరియా ప్రకటించారు.  బాధితురాలికి న్యాయం చేయలేని తనకు ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘నిరుపేద దళిత అమ్మాయికి అన్యాయం జరిగింది. ఓ నిండు ప్రాణం బలైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా నేనేమీ చేయలేకపోయాను. అంటే ప్రజాప్రతినిధిగా ఉండే నైతిక హక్కు కోల్పోయాను అందుకే ఈ రాజీనామా’ అంటూ ఈ కాంగ్రెస్‌ నాయకుడు వ్యాఖ్యానించారు.

కాగా గతేడాది అక్టోబరు 10న కోరాపుట్‌లోని కుండలి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పొట్టంగి పోలీసు స్టేషను పరిధిలో నలుగురు వ్యక్తులు ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. తనకు న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేయాలంటూ బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవపోవడంతో.. జనవరి 22న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రెడ్‌ ఫ్లాగ్‌ కేసుగా ప్రాచుర్యం పొందిన కేసులో ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు