మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ

Published Sat, May 2 2020 3:38 PM

Liquor shops to ecommerce during lockdown Govt clarifies  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్  వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోవడంతో మే 4 నుంచి మే 17 వరకు దేశంలో లాక్‌డౌన్‌ 3.0 (మూడవ దశ)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది.  ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. 

దేశవ్యాప్తంగా జిల్లాలను  రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్లు (అత్యధిక సంఖ్యలో కేసులు, రేటు) ఆరెంజ్ జోన్ (తక్కువ కేసులు) గ్రీన్ జోన్ ( గత 21 రోజులలో కేసులు లేకపోవడం) గా వర్గీకరించింది.  తాజా సడలింపులు, మద్యం దుకాణాలు లేదా ఇ-కామర్స్ సేవలపై గందరగోళం నెలకొనడంతో  కేంద్రం స్పష్టతనిచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు  అందించిన వివరాల ప్రకారం  ఆంక్షలు, సడలింపులు ఈ విధంగా ఉండనున్నాయి. (ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!)

ఆరెంజ్ , గ్రీన్ జోన్లు

  •  రెండింటిలోనూ మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి వుంటుంది. 
  • అన్ని వస్తువులకు ఇ-కామర్స్ అనుమతి.  ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతి వుండగా, తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
  • అలాగే ఇంటి  పనిమనుషులను అనుమతించాలా లేదా అనేది ఆయా రాష్ట్ర, లేదా యూటీ (కేంద్రపాలిత ప్రాంతాలు)ల నిర్ణయంపై ఆధారపడి వుంటుంది.

 రెడ్ జోన్లు

  • నాన్ కంటైన్ మెంట్ జోన్లలో మార్కెట్ కాంప్లెక్స్ లేదా మాల్‌లో భాగం కాని స్వతంత్ర మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి.
  • అత్యవసరమైన వస్తువులకు మాత్రమే  ఇ-కామర్స్ అనుమతి.  అత్యవసరం  కాని వస్తువుల విక్రయానికి అనుమతి లేదు.
  • మాల్స్, అందులో ఉండే షాపులకు అనుమతి లేదు. అయితే సింగల్ విండో షాపులు, కాలనీల్లోని షాపులకు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు అనుమతి ఉంది. ఇక ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి.
  • అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌వేర్‌, జూట్ మిల్లులకు అనుమతి ఉంది.  అయితే ఇక్కడ పనిచేసే వారందరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ధరించాల్సి ఉంటుంది.
  • పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి.
  • పట్టణాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న కూలీలతో కొనసాగుతాయి. అంతేకాక అక్కడ పని చేసేందుకు వచ్చే కూలీలను బయట ప్రాంతాలకు తరలించకూడదు.
  • ప్రైవేట్ ఆఫీసులు 33శాతం స్టాఫ్‌తో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.
  • డిప్యూటీ సెక్రటరీ, ఆపైస్థాయి‌ ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో.. అలాగే మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా 33 శాతం సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది.

గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సడలింపులు, పరిమితులు రెడ్, ఆరెంజ్ జోన్లలో స్థానిక అధికారులు గుర్తించిన కంటైన్ మెంట్ ప్రాంతాలకు వర్తించవు. అనుమతించిన నిత్యావసరాల సరఫరాకు మించి కంటైన్ మెంట్ జోన్ ప్రాంతాలు తీవ్రమైన పరిమితులకు లోబడి వుంటాయి . (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట)

ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, లాక్‌డౌన్‌ ఆదేశాల ప్రకారం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఆంక్షలను సడలించడానికి వీల్లేదు. ఉదాహరణకు రెడ్ (స్వతంత్ర దుకాణాలు మాత్రమే), ఆరెంజ్, గ్రీన్ జోన్స్, జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం వుంది. కానీ కావాలనుకుంటే రాష్ట్రాలు, యూటీలు మద్యం షాపులను  మూసి వుంచడానికి కేంద్రం అనుమతినిచ్చింది. అదే సందర్భంలో రెడ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల అమ్మకానికి ఇ-కామర్స్ సంస్థలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి వుండదు.  ఈ నెల 3వ తేదీతో ముగియనున్నరెండవ దశ లాక్ డౌన్ ను పొడిగించి,  అనేక ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ప్రభుత్వం గణనీయంగా సడలించింది. మార్చి చివరిలో అమల్లోకి వచ్చిన దేశవ్యాప్త లాక్‌డౌన్ విస్తరించడం ఇది రెండోసారి.  (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం)

Advertisement
Advertisement