చెన్నైః మృత్యు క్రీడలుగా మారిన బ్లూవేల్ ఛాలెంజ్ వంటి ఆన్లైన్ గేమ్స్పై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఇలాంటి గేమ్స్పై తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరించింది. చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న బ్లూవేల్ తరహా గేమ్స్ను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించాలన్న న్యాయవాది కృష్ణమూర్తి అప్పీల్పై జస్టిస్ కేకే శశిధరన్, జీఆర్ స్వామినాధన్లతో కూడిన మధురై బెంచ్ ఈ మేరకు పేర్కొంది.
ఈ అంశాన్ని తాము సుమోటోగా స్వీకరించి ఈనెల 4న విచారణ చేపడతామని తెలిపింది. ఆన్లైన్ గేమ్ ఆడిన అనంతరం ఆగస్ట్ 30న విఘ్నేష్ అనే కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. బ్లూవేల్తో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో డెడ్లీ గేమ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.