అజిత్‌ పవార్‌కు క్లీన్‌ చిట్‌ | Sakshi
Sakshi News home page

అజిత్‌ పవార్‌కు క్లీన్‌ చిట్‌

Published Tue, Nov 26 2019 4:09 AM

Maharashtra Deputy CM Ajit Pawar clean chit Irrigation scam - Sakshi

ముంబై: ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌పై ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కుంభకోణానికి సంబంధించి ఉన్న 9 కేసులపై దర్యాప్తును సరైన ఆధారాలు లేని కారణంగా మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం వెల్లడించింది. ఈ కేసులతో ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కుæ సంబంధంలేదని ఏసీబీ అదనపు ఎస్పీ అజయ్‌ అఫెల్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌–ఎన్సీపీ ప్రభుత్వ హయాం(1999–2014)లో అజిత్‌ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో రూ.70వేల కోట్ల మేర జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ చేస్తోంది.

అవసరమని భావిస్తే కోర్టు గానీ, ప్రభుత్వం కానీ ఈ కేసులను తిరిగి తెరవచ్చునని అజయ్‌ తెలిపారు. విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అనుమతులిచ్చిన 45 ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ ముంబై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో దర్యాప్తు చేపట్టి ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేయగా, 5 కేసుల్లో చార్జిషీట్లు వేసినట్టు తెలిపారు. ఈనెల 23వ తేదీన బీజేపీ నేత ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే అజిత్‌ పవార్‌పై కేసులు మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రకటించడం దుర్మార్గమని కాంగ్రెస్‌ మండిపడింది.

Advertisement
Advertisement