జైషే మహ్మద్‌ కుట్ర భగ్నం | Sakshi
Sakshi News home page

జైషే మహ్మద్‌ కుట్ర భగ్నం

Published Fri, Jan 17 2020 4:28 AM

Major terror attack averted before Republic Day - Sakshi

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున విధ్వంసం సృష్టించేందుకు జైషే మహ్మద్‌ పన్నిన కుట్రను శ్రీనగర్‌ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోండనా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ గజ ఉగ్రవాదిని దోడా జిల్లాలో మట్టుబెట్టామని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌సింగ్‌ తెలిపారు.

కాగా, ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడిన డీఎస్పీ దావిందర్‌సింగ్‌ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ జరపనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఆయనకు అందజేసిన శౌర్య పతకాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఉండగా, చొరబాట్ల కోసం, కేడర్‌ను బలోపేతం చేయడానికి ఉగ్ర సంస్థలు రహస్య సమాచార వ్యవస్థను, వాయిస్‌ ఆన్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (Vౌఐ్క)ను ఉపయోగిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని డివిజన్లలో బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యాలను అత్యవసర సేవలు అందించే బ్యాంకులు, ఆసుపత్రులు లాంటి సంస్థలకు మాత్రమే పునరుద్ధరించాలని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం మంగళవారం ఆదేశించిన విషయం తెలిసిందే.

ఒమర్‌ అబ్దుల్లా నివాసం తరలింపు
జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను అధికారిక నివాసానికి సమీపంలో ఉన్న మరో ఇంటికి తరలించనున్నారు.ఆర్టికల్‌ 370 రద్దుతో జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటినుంచి ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు.
 

Advertisement
Advertisement