'వారికి లక్ష కోట్లిస్తారు.. వీరికి లక్ష కూడా ఇవ్వరు' | Sakshi
Sakshi News home page

'వారికి లక్ష కోట్లిస్తారు.. వీరికి లక్ష కూడా ఇవ్వరు'

Published Mon, Sep 5 2016 2:03 PM

'వారికి లక్ష కోట్లిస్తారు.. వీరికి లక్ష కూడా ఇవ్వరు'

లక్నో: తనకు అధికారం అప్పగిస్తే మరోసారి ఉత్తరప్రదేశ్లో మంచి రోజులు తీసుకొస్తానని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఆమె సర్వజన్ సుఖాయ్-సర్వజన్ హితాయ్ (సర్వ జనుల సుఖం కోసం-సర్వజనుల మంచికోసం) పేరిట నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. తన పార్టీకి సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, బీజేపీది అని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో సమాజ్ వాది పార్టీ పూర్తి విఫలం అయిందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ను 37 సంవత్సరాలు పరిపాలించిందని అయినా చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో పరిపాలన నడిపేవారు ధనికులైన పారిశ్రామికవేత్తలని, అందుకే వారికి మాత్రమే లబ్ధి చేకూరేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. భూచట్టాలను కూడా వారికోసమే సరళీకృతం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పారిశ్రామిక వేత్తలకోసం కోట్లలో లోన్లు విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతు కోసం కనీసం లక్ష రూపాయలు కూడా ఇవ్వలేకపోతుందని అన్నారు. ఫలితంగా వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement