సాక్షి, కర్ణాటక(యలహంక) : దావణగెరె జిల్లా మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి, కన్నడ మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్గౌడ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తన ఇష్ట ప్రకారమే నిర్మాత సుందర్గౌడను పెళ్లి చేసుకున్నానని, ఇందులో ఎవరి బలవంతము లేదని లక్ష్మి పేర్కొన్నారు. ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ తన కుమార్తె కనిపించక పోవడంతో బెంగళూరులోని యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నవ దంపతులను కన్నడ హీరో దునియా విజయ్ స్వయంగా తన వాహనంలో యలహంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి సీఐ మంజునాథ్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ ఆమెను విచారణ చేశారు. తన ఇష్ట ప్రకారమే తాను సుందర్ గౌడను పెళ్లి చేసుకున్నానని చెప్పారు.
తల్లి, అవ్వ కన్నీటి పర్యంతం
ప్రేమ పెళ్లి చేసుకున్న నవ దంపతులు పోలీస్ స్టేషన్కు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న లక్ష్మి నాయక్ తల్లి గీతా, అవ్వ లక్ష్మి బాయి సహా పది మందికి పైగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తన కుమార్తె లక్ష్మిని చూడగానే తల్లి, అవ్వ రోదిస్తూ ఇంటికి వెళ్దాం రామ్మా అంటూ బతిమిలాడినా లక్ష్మి మౌనంగానే ఉండిపోయింది. దీంతో వృద్ధురాలు అయిన లక్ష్మిబాయి కొద్ది సేపటికే స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.