'పాకిస్తాన్‌ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్‌' | Sakshi
Sakshi News home page

'పాకిస్తాన్‌ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్‌'

Published Sun, Dec 29 2019 5:36 PM

Naqvi Demands Immediate Action Against Meerut SP - Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద కామెంట్లను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఖండించారు. సంబంధిత పోలీసు అధికారి గనుక వీడియోలో కనిపించినట్లు నిజంగానే ముస్లింలను పాకిస్తాన్ వెళ్లిపోవాలన్న అనుచిత వ్యాఖ్యలు చేసుంటే కచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా పెద్ద దేశ వ్యాప్తంగా ఎత్తున ఉద్యమాలు జుగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లోనైతే వేరే చెప్పనక్కర్లేదు. ఈ నిరసనలు హింసాత్మకమవుతూ పలువురు ప్రాణాలు కోల్పోయారు.

చదవండి: వాళ్లను పాకిస్తాన్‌ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్‌ ఎస్పీ

కాగా.. మీరట్ ఎస్పీ గో బ్యాక్ టు పాకిస్తాన్ వీడియో వైరల్ కావడం, దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మైనార్టీల మంత్రిగా నఖ్వీ స్పందించారు. అల్లరిమూకలు కావొచ్చు లేదా పోలీసులే కావచ్చు.. తప్పుచేసిన వాళ్లెవరినీ వదిలిపెట్టొద్దు. మీరట్ ఎస్పీ కామెంట్లు ముమ్మాటికీ వివాదాస్పదమైనవే. సాక్ష్యాధారాలు పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలి'' అని మంత్రి డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదని  ఆయన పేర్కొన్నారు. కాగా గతంలో, పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మీరట్‌లోని లిసారీ గేటు దగ్గర సీఏఏ నిరసనలు చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే పాకిస్తాన్‌ వెళ్లిపోండి ఇక్కడి తిండి తింటూ, పక్కదేశాన్ని పొగడటానికి సిగ్గులేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement