సురక్షితమైన చోట మోదీ బస | Sakshi
Sakshi News home page

సురక్షితమైన చోట మోదీ బస

Published Wed, Jul 5 2017 11:28 PM

సురక్షితమైన చోట మోదీ బస - Sakshi

జెరూసలెం: మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ దేశం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆయన ఉండేందుకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన హోటల్‌ సూట్‌లో బస ఏర్పాటు చేశారు.

జెరూసలెంలోని కింగ్‌ డేవిడ్‌ హోటల్‌లో మోదీ ప్రస్తుతం ఉంటున్నారు. ఆయన ఉండే సూట్‌ అత్యంత సురక్షితమైనది. బాంబు దాడులు, రసాయనిక దాడులు.. ఇలా ఎలాంటి దాడులు జరిగినా.. మోదీ బస చేసిన సూట్‌ మాత్రం చెక్కుచెదరదని కింగ్‌ డేవిడ్‌ హోటల్‌ ప్రతినిధి షెల్డన్‌ రిట్జ్‌ తెలిపారు. ప్రధాని మోదీ, తన ప్రతినిధి బృందం ఉండేందుకు దాదాపు 110 గదులను కేటాయించారు. ఇప్పటి వరకు ఈ ప్రత్యేకమైన సూట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు క్లింటన్, బుష్, ఒబామా మాత్రమే ఉన్నారు.

వారి తర్వాత ఆ గౌరవం ప్రధాని మోదీకి దక్కడం విశేషం. మోదీకి ఇష్టమైన గుజరాతీ వంటకాలతో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన తినే కుకీస్‌లో కూడా కోడిగుడ్డు, పంచదార లేకుండా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. మోదీ ఉండే సూట్‌కు ప్రత్యేకంగా కిచెన్‌ ఏర్పాటు కూడా ఉంది. ఆయనకు ఎప్పుడు ఏమి తినాలనిపిస్తే అందులో వెంటనే వంట చేసి నిమిషాల్లో అందిస్తారు. ప్రధాని మోదీ ఉండే ప్రాంతమంతా భారతీయులు ఇష్టపడే పువ్వులతో అందంగా అలంకరించారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ.

Advertisement
Advertisement