హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు దగ్గరి పోలికలున్నాయని బీజేపీ పేర్కొంది. మీడియా, పరిపాలన, న్యాయ వ్యవస్థలతో వ్యవహారాలను చక్కదిద్దటంలో ఇద్దరిదీ దాదాపు ఒకే విధానమని ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు అన్నారు. ప్రపంచ వ్యవహారాలపై వారిద్దరి దృక్కోణం, నిర్ణయాలు తీసుకోవటం, రాజకీయ, పరిపాలన దక్షతల్లో ఇద్దరికీ సారూప్యత ఉందని పేర్కొన్నారు. ఆయా అంశాల్లో ఇద్దరిదీ ప్రత్యేకమైన విధానమని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ నేతల్లో మోదీ, ట్రంప్లది కొత్త ఒరవడి అని చెప్పారు.
ఒకప్పుడు టీ విక్రయించిన నరేంద్ర మోదీ అంచలంచెలుగా పార్టీలో ఎదిగి.. దేశవ్యాప్తంగా ప్రజాభిమానం చూరగొని ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారన్నారు. అదేవిధంగా కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్నకు అస్సలు రాజకీయాలతో పరిచయమే లేదని, అలాంటి వ్యక్తి ప్రజాభిమానంతో అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించారని వివరించారు. ఇటువంటి నేపథ్యమే వారిద్దరినీ విభిన్నమైన నేతలుగా మార్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య చర్చలు ఫలప్రదమవుతాయని భావిస్తున్నామన్నారు.