సాక్షి, భువనేశ్వర్ : ఒడిషాలో అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ పాలక బీజేడీని టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఒడిషాలో బీజేపీ ఎదుగుదలతో నవీన్ పట్నాయక్కు నిద్రలేని రాత్రులు ఎదురవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం చివరి రోజు కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. ఒడిషాకు ప్రధాని మోదీ భారీస్ధాయిలో నిధులు సమకూర్చుతున్నా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టడం లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బీజేడీ సర్కార్ను కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు. తన సందేశాన్ని రాష్ట్రంలో ఇంటింటికీ తీసుకువెళ్లాలని కోరారు. ఒడిషా ప్రజలు మార్పు కోరుతున్నారనేందుకు ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలకు సంకేతమని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీకి రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపొందటం కష్టం కాబోదన్నారు.రాష్ట్రంలో బీజేపీ 120కి పైగా స్దానాలతో అధికారం దక్కించుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.