డామన్లో ఉగ్రవాదుల చొరబాటు! | Sakshi
Sakshi News home page

డామన్లో ఉగ్రవాదుల చొరబాటు!

Published Fri, Nov 6 2015 9:24 AM

డామన్లో ఉగ్రవాదుల చొరబాటు!

డామన్: కేంద్రపాలిత ప్రాంతం డయ్యూడామన్లో ఉగ్ర కలకలం పోలీసులతోపాటు ప్రజలకూ కంటిమీద కునుకులేకుండా చేసింది. నేవీ అధికారుల దుస్తుల్లో, ఏకే-47 తుపాకులు చేతబట్టుకుని డామన్ జిల్లా కేంద్రంలోకి చొరబడ్డ నలుగురు అనుమానితుల్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'తుపాకులతో నలుగురు వ్యక్తులు సంచరిస్తున్నారని స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు, మొదట తీరప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఒక బోటు నుంచి నేవీ అధికారుల దుస్తుల్లో నలుగురు వ్యక్తులు తుపాకుతో దిగిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన డామన్ ఎస్సీ ఈశ్ సింఘాట్.. నగరంలోని అన్నిప్రాంతాలకు సుశిక్షితులైన సాయుధబృందాలను పంపారు. రహదారుల వెంబడి గస్తీని పెంచారు.

రాత్రి 1:30 ప్రాంతంలో ఒక మినీట్రక్కులో ప్రయాణిస్తున్న అనుమానితులను అటకాయించిన పోలీసులు.. ఆయుధాలను లాక్కొని విచారణ నిమిత్తం నలుగురినీ ఎస్సీ ఆఫీసుకు తరలించారు. డామన్కు ఎందుకొచ్చారిని ప్రశ్నించగా '200 కేజీల బరువున్న ఒక వస్తువు కోసం వచ్చాం'అని అనుమానితులు సమాధానమిచ్చారు. మరికొన్ని ప్రశ్నలకు కూడా ఇలా తలతిక్క సమాధానం చెప్పడంతో పోలీసులు తమదైన శైలి విచారణకు ఉద్యుక్తులయ్యారు. అప్పుడుకానీ నిజం బయటపడటేదు!

నేవీ దుస్తుల్లో వచ్చిచ్చిన ఆ నలుగురూ నిజంగా నేవీ అధికారులని, మాక్ డ్రిల్లో భాగంగా డామన్ పట్టణంలో ఒక చోట ఉన్న 'జెమిని' అనే 200 కేజీల బోటును తీసుకెళ్లడం వారి టార్గెట్ అని, లక్ష్యాన్ని చేరుకునే లోపే దొరికిపోయారని నేవీ ఉన్నతాధికారులు లోకల్ పోలీసులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.రు. పట్టుబడ్డ తమవారికి సంబంధించిన పూర్తివివరాలను పోలీసులకు చేరిన అనంతరం, ఆ నలుగురూ విడుదలయ్యారు. 'మిస్కమ్యూనికేషన్' వల్లే ఇలా జరిగిందని ఎస్పీ మీడియాకు వివరించారు.

Advertisement
Advertisement