కలిసే ఎన్నికలకు వెళ్దాం.. | Sakshi
Sakshi News home page

కలిసే ఎన్నికలకు వెళ్దాం..

Published Wed, Aug 6 2014 10:58 PM

NCP-Congress to fight Maharashtra assembly polls together: Sharad Pawar

 సాక్షి, ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీలు కలిసే కూటమిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. పొత్తు విషయమై కూడా ఇరు కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపిస్తోంది. సీట్ల పంపకాల విషయమై తుది నిర్ణయం తీసుకోకపోయినా కలిసే పోటీ చేయాలని పార్టీ అధినేతలు సోనియా, శరద్‌పవార్ నిర్ణయించారు. ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యాగాంధీతో ఢిల్లీలోని ఆమె నివాసస్థానంలో బుధవారం ఉదయం సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా మహారాష్ట్రలో మరో రెండు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంపై చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తు విషయంపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్టేనని రాజకీయనిపుణులు చెబుతున్నారు. అయితే సీట్ల పంపకాల విషయంపై మాత్రం ఇరు పార్టీల అధ్యక్షులు ఎలాంటి చర్చ లు జరపలేదు. దీంతో తొందర్లోనే ఈ విషయంపై చర్చలు జరిపి.. ఎవరెన్ని సీట్లలో పోటీ చేయనున్నారనేది స్పష్టం చేయనున్నారు.

 సీట్ల పంపకాలపై చర్చలు కూడా ఢిల్లీలోనే జరగనున్నాయని తెలిసింది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెం బ్లీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 174 సీట్లలో పోటీ చేయగా ఎన్సీపీ 114 సీట్లలో పోటీచేసింది. అయితే ఈసారి లోకసభలో కాంగ్రెస్ కంటే అధికంగా సీట్లు వచ్చాయని, దీంతో తమకు 144 సీట్లు కేటాయించాలని రాష్ట్రం లోని ఎన్సీపీ నాయకులు డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం అందుకు ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే.

శరద్‌పవార్ సోదురుని కుమారుడైన అజిత్‌పవార్, మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరేలు  ఎన్సీపీకి 144 స్థానాలను ఇవ్వాల్సిందేనని, లేదంటే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సీఎం పృథ్వీరాజ్ చవాన్,ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే రాష్ట్రంలోని 288 స్థానాలలో పోటీ చేసేందుకు కసరత్తులు కూడా చేశారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్, ఎన్సీపీలు వేర్వేరుగా పోటీ చేసేఅవకాశాలున్నాయని అం దరూ భావించారు. కానీ సోనియా, శరద్‌పవార్ భేటీ తర్వాత పొత్తు విష యం ఖరారైంది.

Advertisement
Advertisement