‘సిగ్గుండాలి’.. నితీష్‌పై లాలూ తిట్లదండకం | Sakshi
Sakshi News home page

‘సిగ్గుండాలి’.. నితీష్‌పై లాలూ తిట్లదండకం

Published Tue, Aug 1 2017 5:26 PM

‘సిగ్గుండాలి’.. నితీష్‌పై లాలూ తిట్లదండకం - Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ తిట్టిపోశారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్‌ ఓ రాజకీయ ద్రోహి అని అన్నారు. నితీష్‌ ఓ పాల్తు-రామ్‌ అంటూ ధ్వజమెత్తారు. నితీష్‌ అధికారంలో కోసం వెంపర్లాడతాడని ఆరోపించారు. ఇన్నిసార్లు వైఖరులు మార్చుకున్న నేతను తానెప్పుడూ చూడలేదని, తమను అధికారంలో నుంచి తొలగించడానికి అతడు చెప్పిన పలు కారణాలు సహించలేకనే తాను ఇక స్పందించాల్సి వస్తుందని మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీ విషయంలో నితీష్‌ వైఖరిని గమనిస్తే అతను ఎలాంటి వారో తెలిసిపోతుందని అన్నారు. మొన్నటి వరకు మోదీ అంటే చిర్రుబుర్రులాడిన నితీష్‌ ఇప్పుడు మాత్రం తెగ పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడని మండిపడ్డారు. మోదీని ఓడించడమే తన లక్ష్యం అని చెప్పిన నితీష్‌ 2019 ఎన్నికల్లో మోదీని ఓడించే నాయకుడే లేడంటూ భజనకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 బిహార్‌ ఎన్నికల్లో లాలూకు ఓట్లు రావడానికి తాను కూడా ఒక కారణం అంటూ నితీష్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.

’నితీష్‌ నాకోసమే ఓట్లు పొందానని చెప్పాడు. ఇలా చెప్పడానికి నితీష్‌కు సిగ్గుండాలి. నేను అతడికంటే చాలా అనుభవజ్ఞుడిని’ అని రుసరుసలాడారు. తానే తనను ముఖ్యమంత్రిని చేశానని నితీష్‌ చెప్పాడు.. కానీ, ఆయన బలమెంతో బిహార్‌ ప్రజలు 2010 ఎన్నికల్లో చూపారు’ అని అన్నారు. ’గతంలో నువ్వు(నితీష్‌) తీసుకున్న నిర్ణయంపైనే ఉండలేకపోయావ్‌ ఆ విషయం మరిచిపోయావా. నువ్వు కేవలం రెండుసార్లు ఓడిపోవడం మాత్రమే కాదు.. లోక్‌ సభ ఎన్నికల్లో కూడా పెద్ద మొత్తంలో దెబ్బతిన్నావు’ అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement