ఆర్టికల్ 370పై యథాతథస్థితి | Sakshi
Sakshi News home page

ఆర్టికల్ 370పై యథాతథస్థితి

Published Mon, Mar 2 2015 1:36 AM

no changes to article 370 in Jammu and Kashmir

- పత్యేక అధికారాల చట్టంపైనా అదే వైఖరి
- కనీస ఉమ్మడి ప్రణాళికలో వెల్లడి

 

జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, భద్రతా బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ)పై యథాతథస్థితి కొనసాగించాలని పీడీపీ-బీజేపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో పేర్కొంది. ‘370’ని రద్దు చేయాలని బీజేపీ, ఏఎఫ్‌ఎస్‌పీఏ రద్దు చేయాలని పీడీపీ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం పీడీపీ-బీజేపీ సర్కారు కొలువుదీరాక సీఎం సయీద్, డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్.. 16 పేజీలతో కూడిన సీఎంపీని విడుదల చేశారు. ఇందులో కీలకాంశాలపై రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని వివరించారు.

సీఎంపీలోని ముఖ్యాంశాలివీ..
     - కశ్మీర్‌కు ప్రత్యేక హోదాపై యథాతథస్థితి కొనసాగింపు. రాజ్యాంగంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఎప్పట్లాగే ఉంటాయి. ప్రస్తుతానికి ఏఎఫ్‌ఎస్‌పీఏ యథాతథంగా కొనసాగుతుంది. అయితే ‘సంక్షుభిత ప్రాంతాలను’ ఈ చట్టం నుంచి మినహాయించాలన్న డిమాండ్‌ను భవిష్యత్తులో రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం పరిశీలిస్తుంది.
    - నియంత్రణ రేఖకు ఇరువైపులా ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు కృషి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో రవాణా, వాణిజ్య సంబంధాల కోసం కొత్తగా మూడు మార్గాలను తెరుస్తాం.
     -  రాష్ట్రసమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు, గ్రూపులతో చర్చలు.
    -  భారత్-పాక్ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు తోడ్పాటు
    -  క శ్మీరీ పండిట్లు తిరిగి వచ్చేందుకు  అవసరమైన చర్యలు తీసుకుంటాం.
  - భద్రతా బలగాలకు లీజు, భూసేకర చట్టం కింద ఇచ్చిన భూములు మినహా అన్ని భూములపై హక్కులు వాటి పూర్వ యజమానులకు దక్కేలా చూస్తాం.

 

Advertisement
Advertisement