మహిళలు, టూ వీలర్స్‌కు ఎగ్జెంప్షన్‌ ఎందుకు? | Sakshi
Sakshi News home page

మహిళలు, టూ వీలర్స్‌కు ఎగ్జెంప్షన్‌ ఎందుకు?

Published Wed, Dec 30 2015 5:54 PM

మహిళలు, టూ వీలర్స్‌కు ఎగ్జెంప్షన్‌ ఎందుకు?

న్యూఢిల్లీ: హస్తినలో జనవరి 1 నుంచి అమలుచేయనున్న 'సరి-బేసి' ట్రాఫిక్‌ నిబంధనల నుంచి మహిళలు, ద్విచక్ర వాహనదారులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం వివరణ కోరుతూ.. తదుపరి విచారణనను జనవరి 6కు వాయిదా వేసింది. ఢిల్లీలో నెలకొన్న వాయుకాలుష్యాన్ని నియంత్రించడానికి 'సరి-బేసి' నెంబర్‌ ప్లేట్ల వాహన నిబంధనలను జనవరి 1 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్తోంది.

'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం వాహనాలను రోడ్లపైకి అనుమతించాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధనల నుంచి మహిళా డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యాన్ని ఎలా నియంత్రిస్తారో చెప్పాలంటూ హస్తిన ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో  కేజ్రీవాల్ సర్కార్ చైనాలోని బీజింగ్‌ తరహాలో 'సరి-బేసి' పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
 

Advertisement
Advertisement