సాక్షి, న్యూఢిల్లీ: మద్యం మాఫియా చేతిలో బలైన ఓ కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. బాధిత కుటుం బాన్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ నైతికస్థైర్యం కల్పించారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రకటించిన అతిపెద్ద మొత్తం నష్టపరిహారాల్లో ఇదొకటి. గత శుక్రవారం అర్ధరాత్రి దక్షిణ ఢిల్లీ వసంత్కుంజ్లోని ఘిటోర్నీ ప్రాంతంలో మద్యం మాఫియా దాడిలో వినోద్కుమార్ (48) అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ పోలీసుశాఖ నుంచి ప్రభుత్వ ఎక్సైజ్ విభాగానికి ఆయన ఆర్నెల్ల క్రితమే డెప్యుటేషన్పై వచ్చారు. ఘిటోర్నీ ప్రాంతంలో అక్రమ మద్యం రవాణాపై సమాచారం అందడంతో వినోద్కుమార్, మరో కానిస్టేబుల్ తనిఖీకి వెళ్లారు. మద్యం మాఫియాకు చెందిన దుండగులు హాకీ స్టిక్లతో వారిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ కానిస్టేబుళ్లు ఇద్దర్నీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, కుమార్ మృతి చెందారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ సోమవారం కుమార్ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం ప్రకటించారు.