అప్లికేషన్‌లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు | Sakshi
Sakshi News home page

అప్లికేషన్‌లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు

Published Wed, Jun 24 2020 3:22 PM

Patanjali didn’t mention Covid-19 drug in license application: official - Sakshi

న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు తెచ్చిన కరోనిల్, స్వాసరి మందులపై ఇస్తున్న వాణిజ్య ప్రకటనలను వెంటనే నిలిపేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలి సంస్థను బుధవారం ఆదేశించింది. ఇటీవల మందుల తయారీ, మార్కెటింగ్ గురించి సంస్థ పెట్టుకున్న అప్లికేషన్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, పతంజలి ఆ అప్లికేషన్ లో కరోనా మందు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ‘పతంజలి అప్లికేషన్ ప్రకారం రోగ నిరోధక శక్తి, దగ్గు, జ్వరానికి మందు తయారు చేస్తామని పేర్కొన్నారు. వాళ్లకు కోవిడ్–19 కిట్ ను తయారు చేసే అనుమతి ఎలా వచ్చిందో నోటీసులు పంపి తెలుసుకుంటాం’ అని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద డిపార్టు మెంట్ లైసెన్సింగ్ ఆఫీసర్ వెల్లడించారు.(ప్రతి ఇంటికి కరోనా పరీక్షలు!)

జైపూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎన్ఐఎంఎస్)తో కలిసి కరోనా చికిత్సకు మందులు కనుగొన్నట్లు పతంజలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థను ప్రమోట్ చేస్తున్న రామ్ దేవ్ బాబా స్వయంగా తానే రెండు మందులను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. కరోనిల్, స్వాసరి మందులను ఢిల్లీ, అహ్మదాబాద్, మీరట్ లలో క్లినికల్ ట్రయల్స్ కూడా చేశామని పతంజలి చెప్పింది. (హెచ్‌ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!)

పతంజలి మందులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్నివివరణ కోరినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. కరోనిల్, స్వాసరి మందులను పరిశీలించి, ఆమోదించే వరకూ ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయొద్దని సంస్థను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement