కుటుంబ నియంత్రణ పాటించ కుంటే ఓటు హక్కు వద్దు | Sakshi
Sakshi News home page

కుటుంబ నియంత్రణ పాటించ కుంటే ఓటు హక్కు వద్దు

Published Tue, Apr 14 2015 1:22 AM

కుటుంబ నియంత్రణ పాటించ కుంటే ఓటు హక్కు వద్దు - Sakshi

  • బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు
  • ఉన్నావ్(యూపీ):  బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలంటే అందరూ కుటుంబ నియంత్రణ పాటించాలని,  పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని అన్నారు. హిందువుల్లాగే ముస్లింలూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను ముస్లింలు, క్రిస్టియన్లు తప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలనడం లేదు.

    జనాభా పెరుగుదలను అడ్డుకోవాలంటే కు.ని. పాటించాల్సిందే. హిందువులు నలుగురు పిల్లల్ని కనాలంటే ఎంతో గొడవ చేశారు. అదే కొందరు నలుగురు భార్యల ద్వారా 40 మంది పిల్లల్ని కంటుంటే ఎవరూ ఏమీ అనరు’ అని అన్నారు. జనాభా పెరుగుదల దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటని పేర్కొన్నారు.

    ‘ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు.. ఎవరైనా కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు.. ఎందరు పిల్లలైనా సమాజంలోని అన్ని వర్గాలకు ఒకే చట్టం ఉండేలా చూడాలి. అందరికీ వర్తించేలా ఉమ్మడి చట్టం తేకుంటే దేశానికే నష్టం. ఇందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ముందుకు రావాలి. ఈ చట్టాన్ని పాటించనివారి ఓటు హక్కును రద్దు చేయాలి’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement