ప్లాన్ చేసి.. అందమైన యువతిని ఎరగా వేసి..! | Sakshi
Sakshi News home page

ప్లాన్ చేసి.. అందమైన యువతిని ఎరగా వేసి..!

Published Thu, May 25 2017 7:40 PM

ప్లాన్ చేసి..  అందమైన యువతిని ఎరగా వేసి..!

బెంగళూరు: రోడ్డు మీద అందమైన యువతి కనిపించిందంటే చాలు.. అటుగా వెళ్లేవారి కళ్లన్నీ ఆమెపైనే ఉంటాయి. ఇక ఆ యువతి నవ్వడం.. తనను చూసి సైగలు చేస్తే ఇంకేమైనా ఉందా..! ఇదే బలహీనతను ఓ ముఠా ఆయుధంగా చేసుకుని దోపిడీకి తెరతీసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చాకచక్యంగా వారిని అరెస్ట్ చేశారు. కర్ణాటక బేగూరులోని ఏకే కాలనీకి చెందిన మోనిషా(20), పునీత్‌(18), మరో అపార్టుమెంటులో ఉండే ముత్తు(19), ఏడీ కాలనీకి చెందిన తులసీరాం(22), అరుణ్‌ యశ్‌రాజ్‌ (22), విఘ్నేష్, స్టీఫెన్‌, బబ్లూ, అలెక్స్, అమర్‌ అనే యువత ఒక ముఠాగా ఏర్పడింది.

వీరు పథకం ప్రకారం ఆకట్టుకునే కురుచ దుస్తులతో మోనిషాను నైస్‌ రోడ్డులోని మైలసంద్ర వంతెనకు సమీపంలోని రోడ్డు పక్కన నిల్చోమని చెబుతారు. అటుగా బైక్‌లపై, కార్లలో వెళ్లేవారిని చూసి నవ్వటం, సైగలు చేయటం వంటివి చేస్తుంటుంది. ఎవరైనా ఆమె వద్దకు వస్తే.. వారిని ముగ్గులోకి దించి ముఠా సూచనల మేరకు సమీపంలోని పొదల వద్దకు తీసుకెళుతుంది. అక్కడికి వెళ్లిన వెంటనే కాచుకుని కూర్చున్న గ్రూపు సభ్యులు కత్తులు, కర్రలతో దాడి చేసి మోనిషాతో వచ్చిన యువకుడి వద్ద ఉన్న నగదు, మొబైల్, ఇతర వస్తువులను లాక్కొని పంపిస్తుంటారు. ఇలా చాలా మందిని భయపెట్టి దోచుకున్నారు.

కొందరు బాధితులు ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇటీవల పథకం పన్ని రాత్రి 10.30 గంటల సమయంలో మాటువేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన గ్రూపు సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు, రెండు చాకులు, ఒక ఇనుపరాడ్డు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని పోలీసుల విచారణలో మోనిషా తెలిపింది. ప్రస్తుతం మోనిషా, పునీత్‌, ముత్తు, తులసీరాం, అరుణ్‌ యశ్‌రాజ్‌ పట్టుబడగా మిగతా వారు పరారీలో ఉన్నారు. త్వరలో మిగతా నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement