Sakshi News home page

‘రూ.50లక్షలిస్తాను.. నోరు మూసుకోండి’

Published Sun, May 7 2017 4:34 PM

‘రూ.50లక్షలిస్తాను.. నోరు మూసుకోండి’

ముంబయి: దాదాపు ఐదు నెలల కిందట వివాదంలో నిలిచిన నీరుల్‌ ఎంజీఎం పాఠశాల మరోసారి ఆగ్రహ జ్వాలల్లో మునిగింది. ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు ఓ 13 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను గర్భవతిని చేయడమే కాకుండా పలువురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తలెత్తిన ఆగ్రహ జ్వాలలు చల్లారకమునుపే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం మరోసారి మంటపెట్టింది.

విద్యార్థినిపై లైంగికదాడి ఘటనను అంతటితో వదిలేయాలని ఆ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌ సవితా గులాతీ డబ్బుతో లెక్కగట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కేసు వెనుకకు తీసుకోవాలని, అంతటితో నోరు మూసుకొని ఉండాలని, లేదంటే జరగబోయే పరిణామాలకు బాధ్యత తమది కాదంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేసిందని తెలిసింది. ఇందుకోసం బాధితురాలి తల్లికి రూ.50లక్షలు ఇచ్చే ప్రయత్నం కూడా చేసిందట. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదరించిందని తెలిసింది.

దీంతో మరోసారి విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముంబయిలోని నీరుల్‌ ఎంజీఎం పాఠశాలలో 13 ఏళ్ల విద్యార్థినిపై హరిశంకర్‌ శుక్లా అనే ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు. ఈ ఘటన కలకలం సృష్టించింది. తాజాగా సీబీఎస్‌ఈ ఆ పాఠశాలకు పంపిన షోకాజ్‌ నోటీసులు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement