‘అలా అయితే మరణాన్నే కోరుకుంటా’ | Sakshi
Sakshi News home page

‘అలా అయితే మరణాన్నే కోరుకుంటా’

Published Tue, May 14 2019 7:11 PM

Rahul Criticised Narendra Modi For Attacking His Late Father Rajiv Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తన తండ్రి రాజీవ్‌ గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీలపై ప్రధాని నరేంద్ర మోదీ అవమానకర వ్యాఖ్యలు చేస్తుండటం పట్ల కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. తాను నరేంద్ర మోదీ తల్లితండ్రులను అవమానించాల్సి వస్తే ఆ పని చేయడం కంటే చనిపోవడానికే మొగ్గుచూపుతానని రాహుల్‌ స్పష్టం చేశారు. తాము ప్రేమతోనే రాజకీయాలు చేస్తామని ఉజ్జయినిలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్‌ పేర్కొన్నారు.

ద్వేషాన్ని వెదజల్లేందుకు తానేమీ బీజేపీ, ఆరెస్సెస్‌ నుంచి రాలేదని అన్నారు. వారిని హత్తుకోవడం ద్వారా వారితో మాట్లాడతానని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్‌ ప్రేమతోనే మట్టికరిపిస్తుందని చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మామిడి పండ్లు ఇష్టమని చెప్పిన సంగతి ప్రస్తావిస్తూ మోదీ వాస్తవ అంశాలను పక్కన పెట్టి మామిడి పండ్లు, మేఘాల గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు.

మీరు మామిడి పండ్లు ఎలా తినాలో చెబుతారు కానీ నిరుద్యోగ యువతకు మీరు ఏం చేశారో దేశానికి చెప్పాలని రాహుల్‌ ప్రశ్నించారు. జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలతో రాత్రికి రాత్రే వేలాది యువత ఉద్యోగాలను కోల్పయారని, దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైందని విమర్శించారు.

Advertisement
Advertisement