డియోరియా: కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ రాజ్ బబ్బర్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తుండగా ఇప్పుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయన మంగళవారం డియోరియా నియోజకవర్గం చేరుకున్నారు. పాంచ్లారి క్రిత్ఫురి గ్రామం నుంచి రాహల్ కిసాన్ యాత్రను ప్రారంభించారు.
కిసాన్ యాత్ర పేరుతో సుమారు 2500 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది. యాత్రా మార్గంలో పేదలు, రైతులు, కార్మికులను కలుసుకొని వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ కార్యక్రమంలో రాహుల్ ఇంటి ఇంటి ప్రచారంలో పాల్గొంటారు. ఖాట్ (మంచం) సభల్లోనూ రాహుల్ పాల్గోనున్నారు. రైతులతో వాళ్ల వాళ్ల గ్రామాల్లోనే మంచాలపై కూర్చుని ముచ్చటించనున్నారు. ఇందుకోసం 2వేల ఖాట్ లను సిద్ధం చేశారు. రాహుల్ తన పర్యటనలో భాగంగా 223 నియోజకవర్గాల్లో పర్యటన చేయనున్నారు. ఈ కిసాన్ యాత్ర డియోరియా నుంచి ఢిల్లీ వరకు సాగుతుంది. కాగా దాదాపు 27 ఏళ్లుగా యూపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.