Sakshi News home page

రాహుల్ గాంధీ ఎందుకు వెళ్లలేదు?

Published Fri, Nov 20 2015 6:03 PM

రాహుల్ గాంధీ ఎందుకు వెళ్లలేదు?

పాట్నా: ఐదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని అతిరథులంతా హాజరయ్యారు. అయితే కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. బిహార్లో మహాకూటమి విజయం తరువాత రాహుల్లో పెరిగిన ఉత్సాహం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు 27 స్థానాల్లో గెలిచి ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపారు. అయితే ఈ కార్యక్రమానికి రాహుల్ ఎందుకు హాజరు కాలేదు? దీనికి పెద్ద కారణం ఏమీ లేదండీ రాహుల్కు ఫ్లైట్ లేటయిందట అంతే.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సంబంధించిన కారణాలతో రాహుల్ వెళ్లాల్సిన ఫ్లైట్ లేటయిందట. అందువల్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి గాంధీ మైదాన్కు ఇప్పుడే వెళ్తున్నట్లు రాహుల్  తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాని అప్పటికే నితీష్, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి అరగంట గడవడం విశేషం.

నితీశ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రతిపక్ష నాయకులతో పాటు ఆరుగురు ముఖ్యమంత్రులు, మాజీ ప్రధాని దేవెగౌడ హాజరయ్యారు. రెండు లక్షల మంది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

Advertisement
Advertisement