తిరువనంతపురం : కరోనా మహమ్మారి కట్టడికి కేరళలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించని వారికి భారీ జరిమానా వడ్డిస్తున్నారు. మాస్క్లు లేకుండా ఎవరైనా బయటకు వస్తే ఐదు వేల రూపాయల జరిమానా వసూలు చేస్తామని వయనాద్ ఎస్పీ ఇలంగో బుధవారం వెల్లడించారు. మాస్క్ ధరించని వ్యక్తిపై కేరళ పోలీస్ చట్టం 118 ఈ కింద కేసు నమోదు చేస్తామని, ఈ చట్టం కింద రూ 5000 జరిమానా వసూలు చేస్తామని చెప్పారు.
నిబంధన ఉల్లంఘించిన వారు జరిమానా చెల్లించకుండా కోర్టులో కేసును ఎదుర్కొనేందుకు సిద్ధపడితే ఆయా వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ 10,000 జరిమానా లేకుంటే రెండూ విధించే అవకాశం ఉందన్నారు. మహమ్మారి నియంత్రణలో భాగంగా దుకాణదారులు తమ షాపుల్లో హ్యాండ్ వాష్లు, లేదా శానిటైజర్లను అందుబాటులో ఉంచకుంటే రూ 1000 జరిమానా విధిస్తామని చెప్పారు. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.